హైదరాబాద్,అర్జున్ సమాచారం:
స్టైపెండ్ పెంపు డిమాండ్తో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరింది. సోమవారం రామంతాపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్–పీజీ విద్యారుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆయుష్ వైద్యుల స్టైపెండ్ పెంపు అంశాన్ని ప్రస్తావించారని జేఏసీ ప్రతినిధులు గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైపెండ్ పెంచాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
========================